Tamilsai: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తమిళనాడు బీజేపీ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ సౌందరరాజన్ తమిళిసై మధ్య స్టేజిపై సంభాషణ జరిగింది. ఈ సంభాషణ సీరియస్ గా సాగినట్లు కనిపించింది. దీంతో వీరిద్దరికి సంబంధించిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ విషయం దేశమంతటా చర్చకు దారి తీసింది. ఇందులో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందు స్టేజిపై ఉన్న తమిళి సై అందరికీ అభివాదం చేస్తున్నారు. ఈ సమయంలో అమిత్ షా వెనక్కి పిలిచి సీరియస్ గా మాట్లాడారు. ఆమె ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. వార్నింగ్ ఇచ్చారంటూ.. రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా, ఈ ఊహాగానాలను తమిళి సై కొట్టిపడేశారు.
తప్పుగా అర్థం చేసుకున్నారు..
అమిత్ షాతో చర్చకు సంబంధించిన సోషల్ మీడియాలో వస్తున్న వీడియోను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తమిళి సై చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అమిత్ షాను తొలిసారి కలిశాను. పోలింగ్ తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో ఎదుర్కొన్న సవాళ్లను తెలుసుకునేందుకు అమిత్ షా పిలిచారు.
నేను ఆయనకు వివరణ ఇస్తుండగా.. సమయ భావాన్ని దృష్టితో మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని చెప్పారు. ఈ మాటలు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుంది.’ అని పేర్కొన్నారు.