International Drugs Racket: దేశంలో మరోసారి అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ గుట్టు రట్టయింది. ఢిల్లీ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ ను అధికారులు చేధించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి.. మత్తు పదార్థాల తయారీకి ఉపయోగించే రసాయనాన్ని పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం.
తాము అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులు గత మూడేళ్లలో మొత్తం 45 సూడోఎఫెడ్రిన్ షిప్మెంట్లను పంపినట్లు ఎన్సిబి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డిడిజి) జ్ఞానేశ్వర్ సింగ్ యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీకి తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ షిప్మెంట్లు సుమారుగా 3,500 కిలోగ్రాముల సూడోఫెడ్రిన్ ఉంటుందని, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.2,000 కోట్ల కంటే ఎక్కువేనని చెప్పారు.
సూడోఫెడ్రిన్ కు అంతర్జాతీయ స్థాయిలో భారీగా డిమాండ్ ఉంది. మెథాంఫేటమిన్ తయారీలో సూడోఫెడ్రిన్ ను ఉపయోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలో కిలో రూ.1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. ఈ మూడు దేశాలకు పెద్దమొత్తంలో సూడోఫెడ్రిన్ పంపుతున్నట్లు ఎన్సీబీకి సమాచారం అందింది. సూడోఫెడ్రిన్ ను హెల్త్ మిక్స్ పొడులు, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్రమార్గంలోనూ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై నిఘా పెట్టిన ఎన్సీబీ.. ఆస్ట్రేలియాకు సూడెఫెడ్రిన్ పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్నారు.
Read More: ఇండస్ట్రీలో మరో విషాదం.. సినీ నిర్మాత వి. మహేష్ కన్నుమూత
ఫిబ్రవరి 15న.. ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ అధికారులు కలిసి పశ్చిమ ఢిల్లీలోని దారాపుర్ లోని గోదాంలో సోదాలు నిర్వహించారు. సుమారు 50 కిలోల సూడోఫెడ్రిన్ ను స్వాధీనం చేసుకుని ఘటనా ప్రాంతంలోనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. భారత్ తో పాటు మలేసియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు డ్రగ్ నెట్ వర్క్ విస్తరించి ఉన్నట్లు వెల్లడైంది. ఈ ముఠా ఇప్పటి వరకూ 3500 కిలోల సూడోఫెడ్రిన్ ఉన్న 45 పార్శిళ్లను ఎగుమతి చేసిందని, వాటి విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని తేలింది.