TDP-Janasena-BJP Alliance(Political news telugu): త్వరలో ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో.. ఎన్డీయేతో టీడీపీ-జనసేన పొత్తు విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. గురువారం రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లతో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం అర్థరాత్రి వరకూ చర్చలు జరిపారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ.. అందుకోసం మిత్రపక్షాలన్నింటినీ తనతో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీని ఎన్డీయేలో చేర్చుకునేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. బిహార్ లో నితీష్ కుమార్, యూపీలో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిని తమలో చేర్చుకున్న ఎన్డీయే అగ్రనేతలు.. నేడో రేపో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ఉన్న బీజేడీని కలుపుకునేందుకు రంగం సిద్ధం చేశారు.
Read More : గ్యాస్ సిలిండర్లకు రాయితీ గడువు పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం..
టీడీపీతో జతకట్టేందుకు సిద్ధమైన బీజేపీ.. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై అమిత్ షా, నడ్డాలు గురువారం రాత్రి 10.30 నుంటి 12.10 గంటల వరకూ చర్చించినట్లు తెలుస్తోంది. అయినా ఇంకా సీట్ల సర్దుబాటు విషయం కొలిక్కి రాలేదు. ఇప్పటికే టీడీపీ – జనసేన కూటమి తొలి లిస్ట్ ను విడుదల చేసిన విషయం తెలిసింది. 175 అసెంబ్లీ, 25 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్ సభ, 24 అసెంబ్లీ ఇచ్చేందుకు అంగీకరించింది. తొలిజాబితాలో జనసేన ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగతా స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సి ఉండగా.. వాటిలో బీజేపీకి ఎన్నిసీట్లు ఇవ్వాలన్న దానిపై తీవ్రమైన చర్చ జరిగిందని సమాచారం.
ఎన్డీయేలో చేరితే.. ఆ పార్టీకి 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకంటే ఎక్కువ సీట్లు కేటాయిస్తే.. కూటమికి నష్టం జరిగే అవకాశం ఉందన్న యోచనలో ఉంది. శుక్రవారం మరోసారి సమావేశం తర్వాత పొత్తు, సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా.. 2014 ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీకి 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. ఇప్పుడు ఆ పార్టీ 7 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లను కోరుతున్నట్లు సమాచారం. టీడీపీతో బీజేపీ పొత్తుపై రాష్ట్ర నాయకులు మౌనంగా ఉన్నారు. పురందేశ్వరి, సోమువీర్రాజు కూడా ఢిల్లీలోనే ఉన్నా అగ్రనేతలే చర్చలు జరుపుతుండటంతో వారెవరూ మాట్లాడటం లేదు.