Supreme Court Pauses ‘Bulldozer Justice’: సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రైవేట్ కట్టడాలపై అనధికారిక బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు చర్యలు వద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది.
ప్రభుత్వ ఆస్తులైన రైల్వే లైన్లు, రోడ్లు, పుట్ పాత్లు, నీటి వనరులను ఆక్రమిస్తే కూల్చివేయొచ్చని తెలిపింది. అలాగే, ఎన్నికల కమిషన్కు కూడా ఇవే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండొద్దని పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొందరిని లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ జమియత్ ఉలేమా-ఏ-హింద్ తరఫున సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ కేసు తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 1 వరకు కోర్టు పర్మిషన్ లేకుండా దేశంలో ఎక్కడా నిర్మాణాల కూల్చివేత చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే లైన్లను,చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలకు ఈ ఆదేశాలు వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధంగా అధికారుల చేతులు కట్టలేమన్నారు. అయితే, కూల్చివేతలను వారం రోజుల పాటు నిలిపివేస్తే.. ఆకాశం పడిపోదు అని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలను ఆమోదించినట్లు ధర్మాసనం తెలిపింది.