Bihar Reservation| రాష్ట్రంలో బిసీలకు రిజర్వేషన్ కోటా పెంచే విషయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఎదురు దెబ్బ తగిలింది. రిజర్వేషన్ కోటా పెంచడం కుదరదని ఇటీవల పట్నా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ .. బిహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. సుప్రీం కోర్టు సోమవారం జూలై 29న ఈ పిటీషన్ విచారణ చేసిన తరువాత హైకోర్టు తీర్పుపై స్టే విధించడం కుదరదని చెప్పింది.
బిజేపీతో కూటమి ప్రభుత్వం నడుపుతున్న బిహార్ ముఖ్యమంత్రి వెనుకబడిన వర్గాలకు గతంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ కోటాను 65 శాతానికి పెంచుతున్నట్లు అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం.. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యాల్డ్ ట్రైబ్స్, బిసీలు, ఆర్థికంగా వెనుకడిన ఈబిసీలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇందులో 20 శాతం ఎస్సీలకు, 2 శాతం ఎస్టీలకు, 25 శాతం ఈబిసీలకు, 18 శాతం ఓబిసీలకు రిజర్వేషన్ కల్పించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రిజర్వేషన్ చట్టం సరికాదని గౌరవ్ కుమార్ అనే వ్యక్తి పట్నా హైకోర్టులో పిటీషన్ వేశాడు. పట్నా హైకోర్టు ఈ పిటీషన్ విచారణకు చేపట్టి.. రాజ్యాంగం ప్రకారం.. రిజర్వేషన్ 50 శాతానికి మించకూడదని చెబుతూ.. నితీశ్ కుమార్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేసింది.
బిహార్ జనాభా కులం వారీగా జరిగిన సర్వేలో.. రాష్ట్రంలో ఓబిసీలు, ఈబిసీలకు 63 శాతం ఉన్నారని, ఎస్సీ, ఎస్టీలు 21 శాతానికి మించి ఉన్నారని తేలింది. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్య కోర్సుల్లో 65 శాతం చట్టం తీసుకువచ్చింది.
Also Read: ఏం బాబూ లిక్కర్ ఫ్రీగా కావాలా? అయితే ఆ దేశానికి వెళ్లాల్సిందే మరి!
సుప్రీంకోర్టు ప్రస్తుతానికి రిజర్వేషన్ కోటా కేసులో స్టే విధించడానికి నిరాకరించినా సెప్టెంబర్ లో విచారణ వాయిదా వేసింది. ఈ అంశంపై బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి మాట్లాడుతూ.. ”వెనుకబడిన వర్గాల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనది.. అందుకే రిజర్వేషన్ కోటా తప్పకుండా పెంచాలి.. ఈ కేసులో న్యాయం కోసం సుప్రీం కోర్టులో పోరాటం చేస్తాం,” అని అన్నారు.