Bilkis Bano : గుజరాత్లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసుల్లో దోషుల విడుదలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 11మంది దోషులను జైలు నుంచి ముందుగానే రిలీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. దోషులకు శిక్షా కాలం తగ్గిస్తూ గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసింది. ఆ 11 మంది దోషులు 2వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
దోషులు విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగిందని.. అందువల్లే దోషులకు శిక్షాకాలం తగ్గించే అధికారం గుజరాత్ సర్కార్ కు లేదని తేల్చిచెప్పింది. ఈ కేసులో రెమిషన్ కోరుతూ దోషి చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని 2022 మార్చిలో సుప్రీంకోర్టు మరో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపైనా తాజాగా ధర్మాసనం స్పందించింది. వాస్తవాలను కప్పిపుచ్చి, మోసపూరిత మార్గాల్లో దోషి ఆ ఆదేశాలను పొందాడని స్పష్టం చేసింది.
2002లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో బిల్కిస్ బానో అత్యాచార ఘటన జరిగింది. అప్పుడు ఆమె ఐదు నెలల గర్భిణి. అదే సమయంలో ఆమె ఫ్యామిలీలోని ఏడుగురు హత్యకు గురయ్యారు. 2008 జనవరి 21న ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. అప్పటి నుంచి దోషులు దాదాపు 15 ఏళ్లపాటు జైలులోనే ఉన్నారు.
ఆ తర్వాత తమను విడుదల చేయాలని కోరుతూ ఓ దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి వినతిని పరిశీలించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. బిల్కిస్ బానో కేసులో నిందితులకు రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేయడంతో గుజరాత్ కోర్టు వారికి శిక్షాకాలం తగ్గించింది. దీంతో 2022 ఆగస్టు 15న దోషులు బయటకు వచ్చారు.