Delhi Political News(National News India): సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేజ్రీవాల్కు ఊరట నిచ్చేలా తీర్పు వచ్చింది. ప్రభుత్వం, ఎల్జీ అధికారాల పరిధిపై స్పష్టత ఇచ్చింది.
ఢిల్లీలో అన్ని అధికారాలు ఎన్నుకున్న ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్జీ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది.
పోలీసులు, లా అండ్ ఆర్డర్ మాత్రమే ఎల్జీ దగ్గర ఉంటాయని.. మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి గట్టి షాక్ తగిలింది.
ఢిల్లీ సర్కారుకు అధికారాలు లేవన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.
అసలేంటీ కేసు..?
ఢిల్లీలోని అన్ని పాలనా సర్వీసులపై కేంద్రానికే నియంత్రణ ఉంటుందంటూ 2015లో కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సానుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2019 ఫిబ్రవరి 14న ఈ వివాదంపై భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించింది. పాలనా సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్ అశోక్ భూషణ్ చెప్పగా.. జస్టిస్ ఏకే సిక్రి దాన్ని వ్యతిరేకించారు. ఢిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించిన శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా లేక ఆ రాష్ట్ర ప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. జస్టిస్ అశోక్ భూషణ్ ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం తోసిపుచ్చింది.