Ajit Pawar : మహా ఎన్నికల ముంగిట కీలక పరిణాం చోటు చేసుకుంది. త్వరలోనే మహా ఎన్నికల నేపథ్యంలో సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇకపై గడియారం గుర్తును ఎన్నికల్లో వాడుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు ఝలక్ ఇచ్చినట్టైంది.
అజిత్ వర్గానికి ఆదేశాలు…
ఇదే సమయంలో శరద్ పవార్ వర్గానికి ఎలాంటి నష్టం రాకుండా ఉండేలా చూసుకోవాలని సూచించింది. అయితే ధర్మాసనం ఉత్తర్వులను ఉల్లంఘించబోమని అజిత్ వర్గం స్పష్టం చేయాలని కోరింది. అలాగే హామీ పత్రాన్ని సైతం సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే…
అజిత్ పవార్ వర్గం ‘గడియారం’ గుర్తును ఎన్నికల్లో వినియోగించకుండా నిరోధించాలని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సుప్రీం తలుపు తట్టారు.
సుప్రీం తలుపు తట్టిన శరద్ పవార్…
ఎన్సీపీ అధ్యక్షుడిగా చాలా కాలం పాటు కొనసాగానని, గడియారం గుర్తుతో తనకు మహా అనుబంధం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఓటర్లు అయోమయానికి గురికాకుండా ఉండేందుకు అజిత్ పవార్ వర్గానికి మరో గుర్తు కేటాయించాలని కోరారు. సదరు పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం తాజాగా విచారించింది.
అజిత్ పవార్ కే పచ్చ జెండా…
ఎన్నికల్లో గడియారం గుర్తును అజిత్ పవార్ వాడుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరోవైపు ప్రచారంలో భాగంగా శరద్ పవార్ వర్గానికి నష్టం లేకుండా ప్రజలకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలని సూచించింది.
చర్యలు తీసుకుంటాం…
నవంబర్ 6లోగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంగించకుండా, అమలు చేస్తామన్న హామీ పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. అయినప్పటికీ ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
పార్టీని చీల్చి డీసీఎం అయ్యారు…
ఎన్సీపీ పార్టీని చీల్చిన అజిత్ పవార్ శిందే వర్గంలో చేరిపోయారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవిని పట్టేశారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం సైతం సంచలన నిర్ణయం తీసుకుంది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించింది. తాజాగా ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తును కూడా వారికే కేటాయించింది.
శరద్ పవార్ నిరాశ…
శరద్ పవార్ వర్గానికి ‘బూరుగ ఊదుతున్న వ్యక్తి’ గుర్తును సీఈసీ ఫైనల్ చేసింది. దీంతో సుప్రీం మెట్లు ఎక్కిన శరద్ పవార్కు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం గమనార్హం.