Rahul Gandhi news today(Latest breaking news in telugu): మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాహుల్ గాంధీపై ఎదుర్కొంటున్న పరువు నష్టం కేసులో జులై 21న విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలని కోరుతూ రాహుల్ వేసిన స్టే పిటిషన్ను ఇటీవల గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2019 లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. కర్ణాటకలోని కోలార్లో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పరువునష్టం కేసు నమోదైంది. గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది మార్చిలో ఈ తీర్పు వెలువరించింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పార్లమెంట్ సభ్యుడికి ఏదైనా కేసులో రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల్లోనే రాహుల్పై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వం రద్దైంది.
సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కిందికోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.