Supreme Court Denies Bail To Satyendar Jain(Telugu news headlines today): ఆప్ నాయకుడు, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. చాలాకాలం తీహార్ జైలులో ఉన్నారు. ఆ సయమంలో చాలా వివాదాలు ఆయన్ని చుట్టిముట్టాయి. జైలులో సపర్యలు చేయించుకున్న వీడియోలో వైరల్ అయ్యింది. ఆయన జైలులోనే అన్ని సౌకర్యాలు పొందుతున్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఆరోగ్య సమస్యలతో సత్యేందర్ జైన్ ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. వైద్య కారణాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం 2023 మే 26న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు పొడిగించడంతో గత 10 నెలలుగా ఆయన బయటే ఉన్నారు.
తాజాగా సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బేలా.ఎం. త్రివేది, పంకజ్ మిథాల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆయన బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. అలాగే వెంటనే లొంగిపోవాలని స్పష్టం చేసింది. అయితే సత్యేందర్ జైన్ లొంగిపోయేందుకు వారం రోజుల గడువు ఇవ్వాలని ఆయన తరఫున వాదనలు వినిపించిన లాయర్ కోరారు. అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు.
Also Read: ఈసీ కీలక నిర్ణయం.. ఆరు రాష్ట్రాల హోం సెక్రటరీల తొలగింపు..
సత్యేందర్ జైన్ 2022 మే 30న అరెస్ట్ అయ్యారు. ఆయనకు చెందిన సంస్థలకు హవాలా నెట్ వర్క్ ద్వారా రూ. 4 కోట్ల 81 లక్షలు అందాయని ఈడీ దర్యాప్తులో నిర్ధారించింది. 2015-16లో వివిధ షెల్ కంపెనీల నుంచి ఈ డబ్బు జైన్ కు చెందిన కంపెనీలకు చేరిందని తేల్చింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ .. రూ. 4 కోట్ల 81 లక్షల రూపాయల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది.