Summer Effect : దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. కొన్నిరోజులపాటు 10 రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే 3 రోజులు వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.
విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడి గాలులు వీస్తాయని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో వచ్చే 3 రోజులు వేడి మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కోస్తాంధ్ర , యానాం, తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్, తూర్పు మధ్యప్రదేశ్లో 2 రోజులపాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ మధ్యప్రదేశ్లలోనూ వేడిగాలులు వీస్తాయని ప్రకటించింది.
మరో వైపు బిహార్లో హీట్వేవ్ 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. అంతకుముందు 2012లో 19 రోజులపాటు వేడిగాలులు వీచాయి. ఈ సారి 20 రోజులుగా వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో బిహార్లో వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
తెలంగాణలో మరో 2 రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉంది. ఆదివారం విపరీతమైన వేడిగాలులు వీయగా.. సోమ, మంగళవారాలు కూడా భానుడితాపం తప్పదని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రమాదకర స్థాయిలో వడగాలులు వీచే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడ గాల్పులు ఉంటాయని తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచేస్తున్నాయి.