BSF Sniper Suman Kumari: భారత భద్రతా దళాల్లో చేరేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. దేశ రక్షణకు మేము సైతం అంటున్నారు. తాజాగా ఓ మహిళ బీఎస్ఎఫ్ లో చేరి కొత్త చరిత్ర సృష్టించారు.
దేశరక్షణలో బీఎస్ఎఫ్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. దేశ సరిహద్దుల్లో గస్తీ కాయడంలో ఈ దళం ఎంతో కీలకమైంది. ఇలాంటి బీఎస్ఎఫ్ లో కీలక విభాగంలో పనిచేసే అవకాశం ఓ మహిళకు దక్కింది. ఈ దళంలో తొలి స్నైపర్ గా సుమన్ కుమారి ఎంపికయ్యారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లాకు చెందినవారు. ఆమె తండ్రి ఎలక్ట్రీషియన్. తల్లి గృహిణి.
సుమన్ కుమారి ఇండోర్ లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ లో శిక్షణ పొందారు. ఇటీవల తన శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఇన్ స్ట్రక్టర్ గ్రేడ్ సాధించారు. స్నైపర్ గా అవకాశం దక్కించుకున్నారు.
స్నైపర్ విధులేంటి?
స్నైపర్లు శత్రుమూకలపై నిరంతరం నిఘా పెట్టాలి. దూర ప్రాంతం నుంచి శత్రులను గుర్తించాలి. గురితప్పకుండా శత్రుమూకలపై కాల్పులు జరిపాలి. ఇలాంటి విధులు నిర్వహించేవారిని స్నైపర్ లుగా పిలుస్తారు. 2021లో బీఎస్ఎఫ్లో సుమన్ కుమారి చేరారు. పంజాబ్ లో ఓ టీమ్ కు నేతృత్వం వహిస్తున్నారు.
Read More : డార్లింగ్ అని పిలవడం లైంగిక నేరం.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు..
దేశ సరిహద్దుల వద్ద దాడుల ముప్పును స్వయంగా చూశారు. అందువల్లే ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపించారు. స్నైపర్ కు శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండాలి. శారీరంగా బలంగా ఉండాలి. స్నైపర్ శిక్షణకు పురుషులు కూడా ముందుకురావడానికి అంతగా ఆసక్తి చూపరు. అంత కఠినంగా శిక్షణ సాగుతుంది.
సుమన్ కుమారి తాను స్నైపర్ శిక్షణ తీసుకోవాలని సంకల్పించారు. ఆమె పట్టుదల గమనించిన ఉన్నతాధికారులు ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బ్యాచ్ లో 56 మందికి 8 వారాలపాటు ట్రైనింగ్ ఇచ్చారు. వారిలో సుమన్ కుమారి ఒకరే మహిళ. శిక్షణ సమయంలో తన సత్తాను చాటారు. ఆమె సంకల్పాన్ని చూసి శిక్షణ ఇచ్చిన అధికారులు ముగ్ధలయ్యారు.
స్నైపర్ గా సుమన్ కుమారి అర్హత సాధించారని సీఎస్ డబ్య్లూటీ ఐడీ భాస్కర్ వివరాలు వెల్లడించారు. తనను చూసి మహిళలు భద్రతా దళాల్లో చేరేందుకు మరింత ఆసక్తి చూపిస్తారని సుమన్ కుమారి అంటున్నారు.