Sukesh Letter to Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసులో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన తర్వాత.. ఒక్కొక్కరి చీకటి బాగోతం వెలుగులోకి వస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆప్ నేతలకు రూ.100 కోట్లు బదిలీ చేయడం పై కవితను పలుమార్లు విచారించిన ఈడీ.. మార్చి 15న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టవ్వగా.. శుక్రవారం ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచి ఈడీ 6 రోజులు కస్టడీకి తీసుకుంది.
Also Read : ఢిల్లీ లిక్కర్ కేసుకు.. ఎలక్టోరల్ బాండ్లకు లింక్ ఉందా ? ప్రముఖ జర్నలిస్ట్ సంచలన ట్వీట్..
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్.. తాజాగా మరో లేఖ రాశాడు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విషయం కేజ్రీవాల్ అరెస్ట్ తో నిరూపితమైందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఆ లేఖలో పేర్కొన్నాడు సుకేశ్. “నా ప్రియమైన కేజ్రీవాల్ జీ.. తీహార్ జైలుకు స్వాగతం.. మీకోసం ఎదురుచూస్తున్నా..” అని తెలిపాడు. మీరు మీ సహచరులంతా నన్ను దొంగ, మోసగాడు అని పిలిచారు.. ఇప్పుడు మిమ్మల్నీ అలాగే పిలుస్తారని రాసుకొచ్చాడు. కేజ్రీవాల్ అవినీతి అంతా బహిర్గతం చేస్తానని సుకేశ్ లేఖలో పేర్కొన్నాడు. కేజ్రీ అరెస్ట్్ తనకు ఉత్తమ పుట్టినరోజు బహుమతి అని తెలిపాడు. అలాగే పూర్తి ఆధారాలతో నా సోదరి కవిత అక్క కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పాడు.
కవిత అరెస్ట్ అయినపుడు కూడా సుకేశ్ తీహార్ జైలు నుంచి లేఖ రాశాడు. తీహార్ క్లబ్ కు స్వాగతం అక్క. నెక్ట్స్ అరెస్ట్ కేజ్రీవాలే అని సుకేశ్ రాసిన లేఖ కలకలం రేపింది. వారంరోజులైనా కాకుండానే కేజ్రీవాల్ అరెస్ట్, వెంటనే ఈడీ కస్టడీ అన్నీ చకచకా జరిగిపోయాయి.