Sukesh Chandrasekhar Letter on Kavitha Arrest(Telugu breaking news): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితపై.. మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. తీహార్ జైలు నుంచి సుకేశ్ రాసిన లేఖ ఇప్పుడు మరో సంచలనానికి దారితీసింది. లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైందన్న సుకేశ్.. కోర్టులో తన అరెస్ట్ బూటకపు రాజకీయమని, అబద్ధపు కేసులు పెట్టారని చేసిన వాదన అంతా అబద్ధమని తేలిందని పేర్కొన్నాడు. నెయ్యి డబ్బాలంటూ కవిత చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుందని తెలిపాడు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీ దేశాల్లో బీఆర్ఎస్ వేలకోట్ల రూపాయలను దాచిపెట్టిందని, అవన్నీ ఈడీ దర్యాప్తులో ఆ అక్రమ సొమ్మంతా బయటికి వస్తుందని సుకేశ్ లేఖలో రాశాడు.
మీకు కూడా తీహార్ జైలు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారని లేఖలో రాశాడు. ప్రస్తుతం వాట్సాప్ సంభాషణలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపాడు. ఈ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ ను కాపాడే ప్రయత్నం చేయవద్దని సలహా ఇచ్చాడు. మద్యం కుంభకోణంలో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు కూడా తెలుసని, మీ అందరికీ స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తూ ఉంటానని పేర్కొన్నాడు.
మరోవైపు కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ సమన్లను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. ఈ పిటిషన్ పై జస్టిస్ బేల త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.
Also Read : ప్రజావాణి తాత్కాలిక రద్దు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
సుకేష్ గతంలోనే కవితను ఉద్దేశించి తీహార్ జైలు నుంచే లేఖలు రాశాడు. గతేడాది ఏప్రిల్ లో కవిత ఫోన్ నంబర్లంటూ స్క్రీన్ షాట్లను విడుదల చేశాడు. తీహార్ క్లబ్ కు స్వాగతం అంటూ రాసిన లేఖ అప్పట్లో కలకలం రేపింది. తాను చాటింగ్ చేసింది కవితతోనే అని.. ఆర్థిక నేరగాడు, మోసగాడు అంటూ నాపై విమర్శలు చేస్తున్న వారిని సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాడు. దీనిపై రియాక్టైన కవిత.. సుకేష్ ఎవరో కూడా తనకు తెలియదని, అతనితో తనకు పరిచయం కూడా లేదని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న తేదీన ఈడీ అధికారులు కవితను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి.. ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. శనివారం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచగా.. ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న జడ్జి నాగపాల్.. కవితను ఈ నెల 23 వరకూ ఈడీ కస్టోడియల్ విచారణకు అనుమతినిచ్చారు. తాజాగా.. ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో కవిత పాత్ర ఉందని తేల్చింది ఈడీ. 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీలో భారీ లాభాల కోసం కవిత ఆప్ నేతలకు ముడుపులు చెల్లించారని ఈడీ పేర్కొంది.