Pakistan : పాకిస్థాన్లోని బజౌర్లో జరిగిన పేలుడుతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ దాడిలో ఇప్పటి వరకు 44 మంది మృతి చెందగా.. మరో వందమందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీనిని ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
బజౌర్లోని ఖార్లో జమియాత్ ఉలేమా -ఎ-ఇస్లాం-ఫజల్ అనే పార్టీ కార్మికుల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులోనే పేలుడు జరిగింది. ఈ దాడిలో ఆ పార్టీ కీలక నేత అమీర్ జియావుల్లా కూడా మరణించాడు. ఇక తీవ్రంగా గాయపడిన వారిన ఆర్మీ హెలికాప్టర్లలో ఆసుపత్రులకు తరలించారు.
గాయపడ్డ వారిని వెంటనే తిమర్ గరా, పెషావర్లోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడు సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని మొత్తం తమ స్వాధీనంలోకి తీసుకుంది. పేలుడు సమయంలో మొత్తం 500 మంది వరకు అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు శబ్ధం రెండు కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. ఇక ఆత్మాహుతి దాడి ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. సభలో బాంబు దాడి జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దాడికి పాల్పడింది ఎవరు? అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు ఈ దాడి తమ పనే అని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఇక ఈ పేలుడును JUI-F నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనుకున్నదేవరో తేల్చాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. తమ పార్టీ నేతలు, ర్యాలీలపై దాడులు జరగడం ఇది తొలిసారి కాదని.. ఈ అంశాన్ని పదే పదే పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు.
అయితే ఈ దాడి అఫ్ఘాన్ తాలిబన్ల పనే అని అనుమానిస్తున్నారు. అఫ్ఘాన్లో తాలిబన్ల పాలనను JUI -F తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అఫ్ఘాన్ ప్రజలు సరిహద్దులు దాటి పెషావర్ ప్రాంతంలోకి రావడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తోంది. దీంతో తాలిబన్లే ఈ దాడికి పాల్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది.