Sudha Murthy Nominated to Rajya Sabha: ప్రముఖ రచయిత్రి, ఫిలాన్త్రోపిస్ట్ సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధా మూర్తిని అభినందిస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రకటన వెలువడటం.. ఆమె రాజ్యసభలో ఉండటం దేశ ‘నారీ శక్తి’కి శక్తివంతమైన నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
“భారత రాష్ట్రపతి సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె ఉనికి మనకు శక్తివంతమైన నిదర్శనం. ‘నారీ శక్తి’, మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది. ఆమెకు ఫలవంతమైన పార్లమెంటరీ పదవీకాలం కావాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు
భారత రాష్ట్రపతి 12 మంది సభ్యులను కళలు, సాహిత్యం, శాస్త్రాలు, సామాజిక సేవలకు చేసిన కృషికి పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేస్తారు.
Read More: మహిళలకు మోదీ ఉమెన్స్ డే గిఫ్ట్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
సుధా మూర్తి భర్త నారాయణ మూర్తి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు. UK ప్రధాన మంత్రి రిషి సునక్ ఆమె అల్లుడు. ఆమె సామాజిక సేవను గుర్తించిన భారత ప్రభుత్వం.. భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ను గత సంవత్సరం అందజేసింది. సుధా మూర్తి 2006లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు.
సరళతకు, నిజాయితీకి పేరుగాంచిన సుధా మూర్తి TELCO (ప్రస్తుతం టాటా మోటార్స్)లో ఇంజనీర్గా తన వృత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్గా ఉన్నారు. ఆమె ఇంగ్లీష్, కన్నడ భాషలలో రచయిత. ఆమె పుస్తకాలను అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించారు.