విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు మీద ప్రత్యేక వంద రూపాయల నాణెం రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ 28న ఢిల్లీ, రాష్ట్రపతి భవన్లో.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ స్మారక నాణెంను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారు. ఇప్పటికే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందాయి. ఎన్టీఆర్తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ వచ్చింది.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే వంద రూపాయిల నాణేన్ని.. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్తో తయారు చేశారు. నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీలో ముద్రించారు. ఎన్టీఆర్ శతజయంతి ఏడాదికి సింబాలిక్గా 1923-2023 అని ముద్రితమై ఉంటుంది.
మరోవైపు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ 28న ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేస్తారని చెబుతున్నారు. ఈసీ అధికారులతో భేటీ తర్వాత.. రాష్ట్రపతి భవన్లో జరిగే ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారని తెలుస్తోంది.