South Central Railway Warns Selfie Lovers : స్మార్ట్ ఫోన్ వచ్చింది మొదలు.. సెల్ఫీలంటే పిచ్చెక్కువైంది జనాలకు. అయినదానికి, కానిదానికి సెల్ఫీలు తీసుకోవడం.. లైకుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేయడం. ఉదయం లేచిన దగ్గర్నుండీ ఇదే పని. రోడ్డుమీద ప్రమాదం జరిగినా, మనిషి చచ్చినా, జంతువుల్ని హింసిస్తున్నా.. సందర్భంతో పని లేకుండా ప్రతీ దాన్నీ నెట్టింట్లో పెట్టేస్తున్నారు. కొంతమంది యువకులైతే.. సాహసం పేరుతో ప్రాణాపాయం పొంచి ఉన్న రైల్వే ట్రాక్ లపై సెల్ఫీలు తీసుకోవడం, కదులుతున్న రైలు డోర్ నుంచి బయటకు నిలబడి, రైలు వస్తుండగా సెల్ఫీలు దిగడం వంటివి చేస్తుంటారు.
ఈ క్రమంలో యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలెన్నో ఉన్నాయి. సెల్ఫీల కోసం రిస్క్ చేస్తున్న యువతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సీరియస్ ప్రకటన చేసింది. ట్రాక్ లపై, టైన్లు దిగుతూ, కదిలే రైళ్లెక్కుతూ, రైలు పట్టాలపై సెల్ఫీలు దిగేవారిపై, వీడియోలు తీసుకునే వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
Also Read : మోదీ సర్కార్ పై ఆగ్రహం.. విచారణ జరగాల్సిందేనన్న సోనియా
ఇండియన్ రైల్వే యాక్ట్ 1989 ప్రకారం.. ఇలాంటి పనులు చేయడం చట్టరీత్యా నేరమని రైల్వే అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరు నెలలు జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. సెల్ఫీలు తీసుకోవడమే కాదు.. నిషేధిత ప్రాంతంలో రైలెక్కడం కూడా నేరమేనని, అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పింది.
షార్ట్ కట్ లో వెళ్లిపోవచ్చని ట్రాక్ లు దాటే ప్రయత్నాలు చేయొద్దని సూచించింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను, సబ్ వే లను, ఇతర ప్రత్్యామ్నాయ మార్గాలను వాడాలని సూచించింది. కాబట్టి.. సెల్ఫీ లవర్స్ ఈ విషయాన్ని గ్రహించి రైల్వే ట్రాక్ లపై, డోర్స్ లో, ట్రాక్ లపై సెల్ఫీలు తీసుకోవడం మానండి. లేదంటే జైలు పాలవ్వక తప్పదు.