ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు సోనియాగాంధీ. ప్రజాస్వామ్యానికి బీజేపీ ప్రభుత్వం ఉరి బిగించిందని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారన్న ఆమె.. న్యాయమైన డిమాండ్ను లేవనెత్తినందుకు ఇలా ఎప్పుడు జరగలేదన్నారు. డిసెంబర్ 13న జరిగిన ఘటన క్షమించరానిదని, సమర్థించరానిదని సోనియా అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ప్రధాని మోడీ మాట్లాడేందుకు 4 రోజుల సమయం పట్టిందని.. అది కూడా సభ వెలుపల మాట్లాడారని విమర్శించారు.
జమ్మూ-కశ్మీర్ బిల్లులపై చర్చ సందర్భంగా నెహ్రూ వంటి గొప్ప వ్యక్తుల పరువు తీసేలా చరిత్రను వక్రీకరించి ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు సోనియా. ఈ ప్రయత్నాలకు, ప్రచారానికి ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్షా స్వయంగా నేతృత్వం వహించారు. అయితే.. ఈ విష ప్రచారానికి మేం బెదరలేదు, చెదరలేదు.. నిజం చెప్పడంలో పట్టుదలతో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆమె.. చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఓటమితో పేలవమైన పనితీరుకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి, అవసరమైన పాఠాలను నేర్చుకోవడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పటికే మొదటి రౌండ్ సమీక్షలు నిర్వహించారని.. పార్టీ అపారమైన సవాళ్లను ఎదుర్కుంటోందని తెలిపారు.
పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీలను సస్పెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఆవరణ లోని గాంధీజీ విగ్రహం వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కూడా పాల్గొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సేవ్ డెమోక్రసీ అంటూ ఫ్లకార్డు లను పట్టుకుని.. బీజేపీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. సస్పెండ్ అయిన ఎంపీలకు వ్యతిరేకంగా డిసెంబర్ 22న దేశ వ్యాప్త నిరసనకు యోచిస్తున్నట్లు ఖర్గే వెల్లడించారు.
పార్లమెంట్ లో దాడి ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై విపక్షాలు చర్చకు డిమాండ్ చేశాయి. విపక్షాల ఆందోళనతో సభ గందరగోళంగా మారడంతో పలువురు ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు లోక్సభ నుంచి 95 మంది.. రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీలు కలిపి.. మొత్తం 141 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు.