Smriti Irani Reacts on Rahul Gandhi move From Amethi: అమేథి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోర్ లాల్ శర్మ పేరును ప్రకటించడంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రాయ్ బరేలీ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడం అమేథి ప్రజల విజయమని తెలిపారు. అమెథీలో రాహుల్ ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్లు అయిందని అన్నారు. అందుకే గాంధీ కుటుంబం నుంచి ఎవ్వరూ అమేథి నుంచి పోటీకి దిగడం లేదని తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయలేదని అన్నారు. అందుకే ఆమె రాజస్థాన్ రాజ్యసభకు వెళ్లారని చెప్పారు. వయనాడ్ లో ఓటమి తప్పదని అర్థమైన రాహుల్ మరో నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే రాయ్ బరేలీ నుంచి పోటీ చేయబోతున్నారని అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో అమేథి నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అమేథి నుంచి పోటీ చేసిన ఆమె విజయం సాధించారు. మూడో సారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.అమేథి ప్రజలు ప్రధాని మోదీ పాలనలో ఎంతో అభివృద్ధిని చూశారని అన్నారు.
అమేథి లోక్ సభ నియోజక వర్గం గాంధీ కుటుంబానికి కంచుకోటగా చెబుతారు. అయితే గతంతో ఇదే స్థానం నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ పోటీ చేసి గెలిచారు. రాహుల్ గాంధీ కూడా 2004ఎన్నికల్లో తొలిసారి అమేథి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.
Also Read: బరేలీ బరిలో రాహుల్.. నామినేషన్ దాఖలు..