Smart Highways: దేశంలోని నేషనల్ హైవేలను స్మార్ట్ హైవేలుగా మార్చాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. 2050 నాటికి విస్తృతం కానున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ను రూపొందించారు. ఇందుకోసం రూ. 6 వేల కోట్లతో జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) లైన్లను వేయనున్నారు. మొత్తం 25వేల కి.మీ మేర ఈ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, కేంద్ర టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)తో కలిసి ప్రణాళిక రూపొందించింది.
పైలట్ ప్రాజెక్ట్ కింద రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్-బెంగళూరు, ముంబై-ఢిల్లీ జాతీయ రహదారులలో ఓఎఫ్సీ లైన్ల పనులు చేపట్టనున్నారు. మొత్తం 2 వేల కి.మీ మేర ఓఎఫ్సీ లైన్లను వేయనున్నారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆతర్వాత చెన్నై-విజయవాడ, ముంబై అహ్మదాబాద్ నేషనల్ హైవేలో ఓఎఫ్సీ లైన్ల పనులు చేపట్టనున్నారు.
జాతీయ రహదారుల వెంబడి నిరంతరాయంగా 5జీ సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా లాజిస్టిక్ రంగాన్ని విస్తృతం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది.
త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్లను కూడా ఎత్తివేసి.. 5జీ నెట్వర్క్ సాయంతో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూల్ చేయనున్నారు. అలాగే జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసే స్పీడ్ రాడార్లు కూడా ఓఎఫ్సీ లైన్ల ద్వారానే పనిచేస్తాయి.