UP : గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ల హత్యపై ముగ్గురు సభ్యులతో సిట్ ను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సాక్షుల స్టేట్మెంట్ల రికార్డు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల సేకరణ, రికార్డుల సమీకరణ, సైంటిఫిక్, ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షల లాంటి వాటిలో నిష్పాక్షిక విచారణకు ఈ సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. సిట్ అధిపతిగా అదనపు డిప్యూటీ కమిషనర్ సతీశ్ చంద్రను నియమించింది. సభ్యులుగా సహాయ పోలీసు కమిషనరు సత్యేంద్ర ప్రసాద్ తివారీ, క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఓం ప్రకాశ్లకు బాధ్యతలు అప్పిగించారు. మరోవైపు దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రయాగ్రాజ్ ఏడీజీ, పోలీసు కమిషనర్, ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్లతో ముగ్గురు సభ్యుల కమిటీని వేసింది. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియమించారు.
అతీక్ అహ్మద్ సోదరులు పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అతీక్ తలకు ఒక బుల్లెట్ తగిలిందని గుర్తించారు. ఛాతీ, శరీరం వెనుక భాగంలో కలిపి మొత్తం 8 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అష్రాఫ్ శరీరం నుంచి 5 బుల్లెట్లను వైద్యులు తీసినట్లు సమాచారం.
అతీక్ అహ్మద్, అతడి సోదరుడి హత్యకు నిందితులు అత్యాధునిక తుర్కియే ఆయుధాలు వాడినట్లు తెలుస్తోంది. నిందితులకు ఈ ఆయుధాలు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులకు తుపాకులు పాకిస్థాన్ నుంచి అందినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటి 6 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు.
అతీక్, అతడి సోదరుడిని కాల్చి చంపిన నిందితులు సన్నీ, లవ్లేశ్, అరుణ్ మౌర్యలను ప్రయాగ్రాజ్ కేంద్ర కారాగారం నుంచి ప్రతాప్గఢ్ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. అతీక్ కుమారుడు అలీ ప్రయాగ్రాజ్ జైలులోనే ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ ప్రధాన అనుచరుడు గుడ్డూ కోసం ఇప్పటికే పోలీసులు వేట ప్రారంభించారు.