Karnataka News Today(Latest breaking news in Telugu) : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. సిద్దూ కేబినెట్ లో మరో 8 మందికి చోటు దక్కింది. డీకే శివకుమార్ వర్గం నుంచి ఒక్కరికే అవకాశం లభించింది.
మంత్రివర్గంలో దళిత సామాజికవర్గం నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. ప్రియాంక్ ఖర్గే , మునియప్ప, పరమేశ్వరకు ఎస్సీ వర్గం నుంచి చోటు దక్కింది. క్రిస్టియన్ల నుంచి కేజే జార్జ్ , ముస్లింల నుంచి జమీర్ అహ్మద్ , గిరిజనుల నుంచి సతీష్ జోర్కోలికి మంత్రి పదవులు దక్కాయి. లింగాయత్ వర్గం నుంచి ఎంబీ పాటిల్ ఒక్కరికే అవకాశం కల్పించారు. రామలింగారెడ్డికి మంత్రి పదవి దక్కింది.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ వీందర్ సింగ్ హాజరయ్యారు . సీతారాం ఏచూరి, ఫారుఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, డి. రాజా, కమల్ హాసన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్, ప్రతిపక్షాల బలప్రదర్శనకు వేదికగా మారింది. ఒకే వేదికపైకి విపక్షాలు కలిసి రావడంతో 2014 తర్వాత ఇదే తొలిసారి కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.