Shivsena Vs Shivsena| మహారాష్ట్రలో దసరా పండుగ అధికార శివసేన వర్సెస్ ప్రతిపక్ష శివసేనగా మారింది. ముఖమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఒకరిపై ఒకరు పదునైన వాగ్బాలు సంధించారు. నవంబర్ లో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు దసరా పండుగ రావడంతో ఇరు పార్టీలు పండుగ వేడుకలను ప్రచారానికి ఉపయోగించుకున్నారు.
1960 సంవత్సరం నుంచి శివసేన పార్టీ సంప్రదాయ బద్దంగా ముంబైలోని శివాజీ పార్కులో దసరా పండుగ జరుపుకుంటోంది. ఈ సంప్రదాయాన్ని పార్టీ వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రే ప్రారంభించారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ ఠాక్రే శివసేన (ఉద్ధవ్ బాల్ ఠాక్రే) పార్టీ తరపున దసరా కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఒక వీడియో క్లిప్ ని స్టేజీపై ప్రసారం చేయగా పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు హోరెత్తించారు. రాబోయే ఎన్నికల తరువాత మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఆ తరువాత కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే వేడి వేడి రాజకీయ ప్రసంగం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏక్ నాథ్ షిండే శివసేన, బిజేపీ కూటమిపై ఘాటు విమర్శలు చేశారు.
కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న శివసేన ఒక డూప్లికేట్ పార్టీ అని, బిజేపీకి తొత్తుగా పనిచేస్తోందని విమర్శించారు. ఇప్పటి బిజేపీ అహంకారానికి మారుపేరుగా ఉందని.. దేశానికి చెడ్డపేరు తీసుకొస్తున్న బిజేపీ నాయకులు తమను తాము భారతీయులుగా చెప్పుకునేందకు సిగ్గుపడాల్సని విషయమని వారంతా కౌరవులుతో సమానమని మండిపడ్డారు. అధికారంలో ఉన్న మహాయుతి కూటమి (ఏక్ నాథ్ శివసేన+బిజేపీ+అజిత్ పవార్ ఎన్సీపీ) కేవలం ఓట్ల కోసమే ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కట్టారని.. అంకిత భావం లేని, అవినీతితో నిర్మించిందుకే విగ్రహం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా శివాజీ మహారాజ్కు ప్రతి జిల్లాలో ఒక దేవాలయం నిర్మిస్తానని చెప్పారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అధికార కూటమి పార్టీలకు కేవలం ఒక ఓటు బ్యాంకు మాత్రమేనని.. కానీ శివాజీ మహరాజ్ తనకు దైవం అని అన్నారు.
Also Read: అవినీతికేసు విచారణ ఆపేయాలని కుమారస్వామి నన్ను బెదిరిస్తున్నారు’.. ఫిర్యాదు చేసిన సిట్ చీఫ్
ఇటీవల మరణించిని దిగ్గజ పారిశ్రామికవేత్త, మానవతావాది రతన్ టాటాను ప్రసంగం సమయంలో ఉద్ధవ్ ఠాక్రే స్మరించుకున్నారు. రతన్ టాటా తనతో చెప్పిన విషయాలను వెల్లడించారు. “ఒకసారి రతన్ టాటా నాతో ఇలా అన్నారు.. ‘ నా ప్రతిభను చూసి జెఆర్డి టాటా నాకు టాటా కంపెనీల బాధ్యతలు అప్పగించారు. అలాగే బాల్ సాహెబ్ ఠాక్రే కూడా నీలోని నిజాయితీని గుర్తించి నిన్ను రాజకీయ వారసుడిగా ఎన్నుకున్నారు’ అని చెప్పారు” అని ఉద్ధవ్ అన్నారు.
మరోవైపు ఆజాద్ మైదాన్ లో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, అధికార కూటమి నాయకులతో దసరా పండుగ జరుపుకున్నారు. శివసేన ఏక్ నాథ్ షిండే పార్టీ తరపున ఆయన మాట్లాడుతూ.. బాలాసాహెబ్ సిద్ధాంతాలను నిజంగా పాటిస్తున్న పార్టీ తమదేనని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముస్లింలను సంతోషపరిచే రాజకీయాలు చేస్తూ.. మరో అసదుద్దీన్ ఒవైసీలాగా మారిపోయారని ఎద్దేవా చేశారు. తాను రాష్ట్రాన్ని, పార్టీని ఉద్ధవ్ బారి నుంచి విముక్తి చేశానని చెప్పుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో పనిచేసిన శివసైనికులు (శివసేన కార్యకర్తలు) ఏళ్లతరబడి ఎన్నో పరాభావాలు చవిచూశారని వారందరూ అభిమానంతో తనతో కలిసివచ్చారని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు ఏమాత్రం జరగలేదని.. పైగా రాష్ట్రం అప్పులు రూ.17 వేల కోట్లు ఇంకా పెరిగిందని విమర్శించారు.