2019 నుంచి అనేక మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. మహారాష్ట్ర వృద్ధ నేత శరద్ పవార్ వ్యహారంపై మిత్ర పక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య జరిగిన సమావేశంలో ఏం చర్చించారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 13న అజిత్ పవార్, శరద్ పవార్లు.. వ్యాపారవేత్త అతుల్ చోర్డియా నివాసంలో భేటీ అయ్యారు. ఎన్డీఏలో చేరికపైనే చర్చించారని కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
కొంతకాలంగా శరద్ పవార్ వ్యవహారం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాల కార్యక్రమంలో శరద్ పవార్.. ప్రధానితో వేదిక పంచుకున్నారు. అటు, పార్టీని చీల్చిన తరువాత కూడా శరద్ పవార్ అతని మేనల్లుడితో 4సార్లు సమావేశం అయ్యారు. ఆత్మీయుల నుంచి ఎన్డీఏలో చేరాలని సలహాలు వస్తున్నాయని శరద్ పవార్ కూడా ఇటీవల ప్రకటించారు. వరుస ఘటనలు శరద్ పవార్ ఎన్డీఏ వైపు చూస్తున్నారనే అనుమానాలకు తావిస్తున్నాయి. ఆగస్టు 13న ఇద్దరు పవార్ల మధ్య జరిగిన మీటింగ్ ఈ అనుమానాలను బలపరుస్తోంది.
శరద్ పవార్ ఎన్డీఏలోకి తీసుకొని వస్తే.. అజిత్ ను సీఎం చేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ సంచలన ఆరోపణలు చేశారు. లేదంటే.. సీఎం కావాలనే కల.. కలగానే మిగిలిపోతుందని మోడీ చెప్పినట్టు వడెట్టివార్ అనుమానించారు. అందుకే, అజిత్ పవార్.. శరద్ పవార్ ను బీజేపీతో జతకట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. శరద్ పవార్ ఎన్డీఏలో చేరితే 2 కేంద్రమంత్రి పదవులను కూడా ఆఫర్ చేసినట్టు మహారాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఇవన్నీ అవాస్తవాలేనని సుప్రియా సూలే కొట్టిపారేశారు. తమకు ఎలాంటి ఆఫర్లు రాలేదని ఆమె అన్నారు.
మరోవైపు, శరద్ పవార్ ఈ అంశంపై స్పందించారు. అజిత్తో జరిగింది కుటుంబ సమేత సమావేశమేనని అందులో రాజకీయ ప్రత్యేకత ఏమీ లేదన్నారు. ఆ విషయాలు మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మణిపూర్ అంశంలో ప్రధాని మోడీ వ్యవహారాన్ని తప్పు పట్టారు.
శరద్ పవార్ అనుమానపు మంతనాలు, కాంగ్రెస్ అనుమానపు చూపుల వేళ.. ఇండియా కూటమి భవిష్యత్తు ఎలా ఉండబోతుందోననే ఆసక్తి పెరిగింది.