Rahul Gandhi Shankaracharya : లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేసే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు నిరసనలు చేయడంతో వివాదం మొదలైంది. ఆ తరువాత లోక్ సభ రికార్డుల నుంచి రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తొలగించారు.
రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి జెపీ నడ్డా లాంటి బిజేపీ అగ్రనాయకులు వ్యతిరేకించారు. రాహుల్ గాంధీ ఇంకా పార్లమెంట్ నియమాలు నేర్చుకోలేదని మండిపడ్డారు. రాహుల్ కు వ్యతిరేకంగా బిజేపీ నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట నిరసనలు కూడా చేశారు. రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: కారు ప్రమాదం తరువాత కొనఊపిరితో ఉన్న మహిళ హత్య.. డ్రైవర్ కూడా నిందితుడే!
అయితే ఈ వివాదంలో తాజాగా రాహుల్ గాంధీకి శంకరాచార్య మద్దతు తెలిపారు. జ్యోతిర్ మఠానికి చెందిన 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద.. రాహుల్ గాంధీ హిందువులను కించపరచేలేదని అన్నారు. ”లోక్ సభలో రాహుల్ చేసిన ప్రసంగం మొత్తం చూశానని.. అందులో ఆయన బిజేపీ, ఆర్ఎస్ఎస్ లను ఉద్దేశించి మాట్లాడారు. హిందువులమని చెప్పుకుంటూ బిజేపీ నాయకులు హింసకు పాల్పడుతున్నారని చెప్పారు. బిజెపి నాయకులు ప్రజలను మతపరంగా విభజిస్తున్నారని ఆరోపించారు.
హిందూ మతం హింసను తిరస్కరిస్తుందని కూడా రాహుల్ తన ప్రసంగంలో అన్నారు. నేను రాహుల్ చేసిన ప్రసంగాన్ని శ్రద్ధగా చూశాను. రాహుల్ చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలు చూపించడం అనైతికం. ప్రజలను తప్పుదోవ పట్టించే వాళ్లకు శిక్షపడాలి. రాజకీయ నాయకులు జవాబుదారీ తనంగా వ్యవహరించాలి.” అని శంకరాచార్య అన్నారు.
Also Read: ఉచితంగా మద్యం పంపిణీ.. ఎక్కడంటే..?
కాంగ్రెస్ ఎంపీ, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా తన సోదరుడిపై వచ్చిన ఆరోపణలని ఖండించారు. రాహుల్ ని సమర్థిస్తూ.. నా సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడలేడని, ఆయన వ్యాఖ్యలు బీజేపీని, ఆ పార్టీ నేతలను ఉద్దేశించి చేసినవేనని ఆమె అన్నారు.