Serum Institute Mpox Vaccine| ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కలకలం రేపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఈ వ్యాధిని అంతర్జాతీ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షమందికి సోకిందని.. వీరిలో 200 మందికిపైగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. భారత దేశంలో కూడా ఈ మంకీపాక్స్ వైరస్ 30 మందికి సోకినట్లు సమాచారం. దీంతో ఈ వ్యాధిని నివారించేందుకు పలు ఫార్మా కంపెనీలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో భారత్ లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ సంస్థ మంకీ పాక్స్ విరుగుడు వ్యాక్సిన్ త్వరలోనే తీసుకొస్తామని.. పరిశోధనలు వేగంగా జరుగుతున్నట్లు మంగళవారం తెలపింది.
”మంకీపాక్స్ వైరస్ విజృభించడంతో డబ్లూహెచ్ఓ ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన తరుణంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం ఈ వైరస్ పై పరిశోధనలు చేస్తోంది. లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఈ వైరస్ కు విరుగుడు కనుగొనేందుకు అత్యవసరంగా పనులు జరుగుతున్నాయి. త్వరలోనే వ్యాక్సిన్ తీసుకొస్తామని నమ్మకుముంది. ఏడాది లోగా ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను,” సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనా వాలా తెలిపారు.
భారతదేశంలో 2022లో మంకీపాక్స్ కేసు తొలిసారి నమోదైంది. మార్చి 2024 వరకు మొత్తం 30 మంకీపాక్స్ వైరస్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇతర రాకపోకల కేంద్రాల వద్ద గట్టి నిఘా పెట్టింది. మంకీ పాక్స్ బాధితుల చికిత్స కోసం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులు ఏర్పాటు చేసింది. దేశంలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్ జంగ్ హాస్పిటర్, లేడీ హర్దింగ్ మెడికల్ కాలేజీలో మంకీ పాక్స్ సోకిన వారికి నోడల్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడే వారిని ఐసోలేషన్, మేనేజ్మెంట్, ఎంపాక్స్ బాధితుల చికిత్స జరుగుతుంది.
ఎంపాక్స్ లేదా మంకీపాక్స్ అంటే ఏమిటి?
ఎంపాక్స్ అని పిలవబడే మంకీపాక్స్ అనేది ఒక వైరస్. ఈ వ్యాధి ఇద్దరు మనుషులు తాకడం వల్ల లేదా సమీపంగా ఉండడం వల్ల జరుగుతుంది. ఎంపాక్స్ వైరస్ సోకిన వ్యక్తి ఒక వస్తువుని తాకితే ఆ వస్తువును తాకిని సామాన్యులకు ఈ రోగం సోకే అవకాశం చాలా తక్కువ. 1970లో తొలిసారి ఈ వైరస్ని ఆఫ్రికా దేశం కాంగోలో కనుగొన్నారు. అయితే 2022లో ఈ వైరస్ ఒక్కసారిగా వ్యాప్తి చెందింది. ఈ కారణంగా జూలై 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ని ఎం పాక్స్ గా వర్ణిస్తూ.. ఈ వ్యాధి గురించి వివరాలు వెల్లడించింది.
ఎం పాక్స్ సోకిన వ్యక్తికి చేతులపై రెండు వారాలపాటు ర్యాషెస్ ఉంటాయి. వాటితో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, మెడ, వీపు నొప్పి, త్వరగా అలసిపోవడం, మెడ కింద, ఛాతి, నడుము కింది భాగాల్లో గడ్డలు ఏర్పడతాయి. ఒటి నిండి ర్యాషెస్ ఆ తరువాత బొబ్బలుగా మారుతాయి. ఈ బొబ్బలు.. చేతులు, కాళ్లు, మర్మాంగాలకు వ్యాపించే అవకాశం ఉంది. కొందరికి తొలిదశలోనే చికిత్స ద్వారా రెండు లేదా నాలుగు వారాల్లో నయం అవుతుంది. కానీ ప్రస్తుతం ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రభుత్వం దీన్ని సీరయస్ గా తీసుకుంటోంది.
మంకీ పాక్స్ వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 99136 నమోదయ్యాయి. వీటిలో 232 మంది చనిపోయారు. ఆఫ్రికా దేశం కాంగోతోపాటు పాకిస్తాన్, స్విడెన్, ఫిలిప్పీన్స్, భారత దేశంలో ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి.