Independence Day : స్వతంత్ర దినోత్సవం వేళ కేంద్రం కొన్ని స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించనుంది. సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక పోటీలు నిర్వహించనుంది. విజేతలకు కానుకలు కూడా అందిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి సెల్ఫీ పాయింట్లను దేశ రాజధాని ఢిల్లీలోని 12 ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆ పాయింట్ల వద్ద సెల్పీ తీసుకోవాలి. ఆ ఫోటోలను MyGov పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఆగస్టు 15 -20 మధ్య ఈ పోటీలు జరుగుతాయి. ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను పంపే అవకాశం కల్పించారు. సెల్ఫీలు పంపిన వారి నుంచి 12 మందిని ఎంపిక చేస్తారు. ఒకొక్కరికి రూ.10 వేలు చొప్పున బహుమతి అందిస్తామని ఈ కాంపిటీషన్ వివరాలను రక్షణశాఖ తెలిపింది.
77వ స్వతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు ఉత్తరాఖండ్లో ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళకు ఆహ్వానం పంపారని సమాచారం. ఆ మహిళ గతేడాదిలో మోదీకి యాపిల్ పచ్చడి పంపారు. ఈ అతిథుల్లో గ్రామ సర్పంచులు , పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం, పీఎం కౌశల్ వికాస్ యోజన పథకం లబ్దిదారులు కూడా ఉన్నారు. అలాగే ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు, ఖాదీ శ్రామికులను ఉత్సవాలకు ఆహ్వానించామని రక్ష మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్రం 1,800 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది. మరో 17 వేల మందికి ఇన్విటేషన్లు పంపింది.