Modi : ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భద్రత వైఫల్యం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు హుబ్బళ్లికి చేరుకున్న ప్రధాని మోదీ.. స్థానిక విమానాశ్రయం నుంచి వేడుక జరిగే రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్ వరకు రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఓ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించి ముందుకొచ్చాడు.
ప్రధాని మోదీకి అత్యంత సమీపంలోకి ఆ యువకుడు దూసుకురావడం కలకలం రేపింది. వాహనం ఫుట్బోర్డుపై నిలబడి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు వెళ్లారు.
ఈ సమయంలో ఆ యువకుడు బారీకేడ్ దాటి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాడు. అక్కడ నుంచి ప్రధాని మోదీ వాహనం వైపు దూసుకెళ్లాడు. ప్రధానికి పూలమాల వేసేందుకు యత్నించాడు.
ఆ యువకుడి చర్యతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వెంటనే అప్రమత్తమైంది. మోదీకి పూలదండ వేయకుండా అడ్డుకుంది. స్థానిక పోలీసులు వెంటనే ఆ యుకుడుని అక్కడ నుంచి దూరం తీసుకెళ్లారు. అనంతరం ప్రధాని మోదీ యథావిధిగా రోడ్డు షో కొనసాగించారు. అయితే ప్రధాని కార్యక్రమంలో భద్రతా వైఫల్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సెక్యూరిటీని ఛేదించి ఆ యువకుడు ప్రధాని మోదీకి అత్యంత చేరువగా ఎలా రాగలిగాడనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో పంజాబ్ కు ప్రధాని వెళుతుండగా ఆందోళనకారులు రోడ్డును నిర్బంధించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ చాలాసేపు ఫ్లైఓవర్పై ఉండిపోవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు కర్నాటకలో మళ్లీ ఈ ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.