Gujarat : ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, టీచర్లు విహార యాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. అందులో 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. గుజరాత్ లోని వడోదరలోని హరిణి సరస్సులో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు.
వడోదరకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల తమ విద్యార్థులను హరిణి సరస్సు వద్దకు విహారయాత్రకు తీసుకెళ్లింది. విద్యార్థులు సరస్సులో విహరించేందుకు ఓ పడవ ఎక్కారు. వారితో పాటుఉపాధ్యాయులు కూడా ఎక్కారు. పడవ సరస్సులో కొంతదూరం వెళ్లగానే తిరగబడింది. పడవలో 27 మంది ఉండగా వారిలో 18 మంది జలసమాధి అయ్యారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. కొందరిని బోటింగ్ సంస్థ సిబ్బంది కాపాడారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సామర్థ్యానికి మించి పడవలో ఎక్కువ మందిని ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పడవలో 14 సీట్లు ఉన్నాయి. కాని 34 మందిని అనుమతించారని అధికారులు తెలిపారు. కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే లైఫ్ జాకెట్లు ధరించారని అన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారాన్ని ప్రకటించారు.