Supreme Court: మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది విక్టోరియా గౌరిని నియమించడాన్ని పలువురు న్యాయవాదులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. సరైన కారణాలు లేకుండా వేసిన పిటీషన్ను అంగీకరించబోమని కొట్టిపారేసింది.
ఈ పిటిషన్లో లేవనెత్తిన అంశం గౌరి అనుకూలమైన వ్యక్తి కాదా అన్న దాని గురించి అని.. అనుకూలతల విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయాలకు సంబంధించి కొలీజియం అన్నింటిని పరిశీలించినాకే ఆమె పేరును సిఫార్సు చేసిందని వెల్లడించింది. ఇక ఆమెను అదనపు న్యాయమూర్తిగా మాత్రమే నియమించారని.. శాశ్వత న్యాయమూర్తిగా సిఫార్సు చేసే సమయంలో కొలీజియం తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోవచ్చని తెలిపింది. అదనపు న్యూమూర్తుల పనితీరు బాగోలేకపోతే వారిని శాశ్వత జడ్జీలుగా నియమించని సందర్భాలు ఎన్నో ఉన్నాయని వివరించింది.
మరోవైపు విక్టోరియా గౌరి మద్రాసు హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఆమె ప్రమాణం చేశారు.