State Bank of India: ఎలక్టోరల్ బాండ్స్ డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్ కు అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం మరోసారి తెర పైకి వచ్చింది. ఆర్టీఐ చట్టం ప్రకారం ఎస్బీఐ ఈసీకి అందించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను వెల్లడించడానికి నిరాకరించింది.
ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. సమాచార హక్కు చట్టం ప్రకారం ఎస్బీఐ ఈసీకి అందించిన ఎలక్షన్స్ బాండ్స్ డేటా అందివ్వాలంటూ.. ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త లోకేశ్ బాత్రా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్స్ డేటాను అందిచడానికి నిరాకరించింది. ఈ సమాచారాన్ని ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ఈ పూర్తి డేటా ఉండగా.. దాన్ని ఆర్టీఐ కింద అందివ్వలేమని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈసీకి సమర్పించిన డేటా డిజిటల్ కాపీ కావాలని ఆర్టీఐ కార్యకర్త లోకేశ్ బాత్రా కోరారు. వ్యక్తిగత సమాచారం విశ్వసనీయమైందని.. ప్రస్తుతం ఈసీ వెబ్ సైట్లో ఉన్నా సరే ఎన్నికల బాండ్ల వివరాలను ఇవ్వలేమని ఎస్బీఐ స్పష్టం చేసింది.
ఆర్టీఐ చట్టంలో ఉన్న సెక్షన్ 8(1)(ఈ), సెక్షన్ 8(1)(జే) ప్రకారం.. విశ్వసనీయ, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయలేమని ఎస్బీఐ పేర్కొంది. ఎన్నికల బాండ్ల కొన్నవారు, రాజకీయ పార్టీల సమాచారాన్ని బహిర్గతం చేయడం ఆయా చట్టాల పరిథిలోకి వస్తుందని వివరించింది.
Also Read: మీకు చేతకాకపోతే చెప్పండి.. మేము రంగంలోకి దిగుతాం: పాక్కు భారత్ కౌంటర్
అయితే లోకేశ్ ఈ డేటాతో పాటుగా సుప్రీంకోర్టులో తమ కేసు వాదించడానికి సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేకు చెల్లించిన ఫీజు వివరాలను కూడా వెల్లడించాలని ఎస్బీఐని కోరారు. అయితే ఆ డేటా కూడా విశ్వసనీయ హోదాలో ఉన్నాయని, సమాచారం వ్యక్తిగతం అని పేర్కొంది. ఈసీ వెబ్ సైట్లో ఉన్న డేటాను ఆర్టీఐ చట్టం కింద వెల్లడించపోవడంపై లోకేశ్ బాత్రా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.