సత్యం కుంభకోణం కేసులో సెబీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన మొత్తాన్ని సత్యం రామలింగరాజుతో పాటు మరో నలుగురు నుంచి వసూలు చేయడానికి నిర్ణయించింది. ఈ నలుగురు 624 కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధి పొందారని.. ఈ మొత్తాన్ని వడ్డీ సహా చెల్లించాలని సెబీ 96 పేజీల ఉత్తర్వలు జారీ చేసింది. సత్యం రామలింగరాజుతోపాటు రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్, జి.రామకృష్ణ ఉన్నారు. దీంతోపాటు రామలింగరాజుకే చెందిన SRSR హోల్డింగ్స్ లిమిటెడ్కు కూడా ఈ కేసులో బాధ్యత ఉందని సెబీ స్పష్టం చేసింది.
సత్యం కంప్యూటర్ సర్వీసెస్లో 2009 జనవరి 7న ఖాతాల కుంభకోణం వెలుగు చూసింది. కంపెనీ లావాదేవీల విషయంలో తప్పుడు లెక్కలు చూపినట్టు రామలింగరాజు అంగీకరించారు. 2001 జనవరి నుంచి 2008 డిసెంబరు మధ్యకాలంలో ఈ తప్పుడు లెక్కలతో ఈ ఐదుగురు భారీగా లాభపడినట్లు సెబీ తేల్చింది. కాబట్టి 624 కోట్ల రూపాయల అసలుతో పాటు.. 2009 జనవరి 7 నుంచి 12 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.