Wrestlers Issue : మరోసారి రెజ్లింగ్ వివాదం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ నియామకంతో ఈ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొంత కాలం క్రితం WFI మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున మహిళా లెజర్లు లేవనెత్తిన ఆందోళన సంచనలంగా మారింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ చేరగా.. చివరికి డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ ఎన్నిక కావడాన్ని వ్యతిరేకించడంతో మళ్లీ రెజ్లింగ్ వివాదం చర్చకు దారి తీసింది.
సంజయ్ సింగ్ నియామకాన్ని నిరసిస్తూ పలువురు రెజ్లర్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ రెజ్లర్, ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించగా.. దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. తాజాగా మరో రెజ్లర్ బజ్రంగ్ పునియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆవేదనతో కూడిన లేఖ రాశాడు బజ్రంగ్. మహిళా రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. వారికి మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొనని తెలిపిన పునియా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గి ఆందోళనను విరమించామని లేఖలో పేర్కొన్నాడు.
మళ్లీ తాజాగా డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో.. రెజ్లింగ్ సమాఖ్య మళ్లీ బ్రిజ్భూషణ్ చేతుల్లోకి వెళ్లిందని.. న్యాయం కోసం ఎక్కడికెళ్లాలో మాకు అర్థం కావట్లేదంటూ లేఖలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీన్ని భరించలేక సాక్షి మలిక్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిందని తెలిపిన ఆయన.. 2019లో తనకు దక్కిన పద్మశ్రీ అవార్డును తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేస్తున్నానంటూ లేఖ రాశాడు బజ్రంగ్ పూనియా. క్రీడా రంగంలో తాజా పరిణామాలతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?, సంజయ్ ఎన్నికకు వ్యతిరేకంగా ఇంకా ఎంత మంది నిరసనబాట పట్టనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న అంశం.
మరోపక్క ఈ వివాదంపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. కేంద్రం తీరును వ్యతిరేకించిన ఆమె.. సాక్షిమాలిక్ ను ఆమెను ఓదార్చారు. అలాగే ఈ వివాదంపై ఆరా తీశారు.