Same Gender Marriage Verdict : స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేసిన సుప్రీం ధర్మాసనం.. కీలక తీర్పు వెలువరించింది. 2023, ఏప్రిల్ 15న ఈ పిటిషన్ దాఖలవ్వగా.. ఏప్రిల్ 17న కేంద్రం తరపున పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణకు ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18 నుంచి విచారణ ప్రారంభించింది.
ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టులో వరుసగా పదిరోజుల పాటు వాదోపవాదాలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తితో పాటూ ధర్మాసనంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హీమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ వాదనలు సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా కేంద్రం, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం ఈ దశలో సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో రాబోయే పరిణామాలను అంచనా వేయడం, ఎదుర్కోవడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది. ఈ అంశంపై కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపినట్టు కూడా కేంద్రం కోర్టులో వెల్లడించింది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అస్సాం ప్రభుత్వాలు స్వలింగ వివాహాల చట్టబద్ధతను వ్యతిరేకించాయని గుర్తుచేసింది. మరోవైపు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మణిపూర్, సిక్కిం మాత్రం నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరాయని చెప్పింది. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై మే 11న తీర్పు రిజర్వ్ చేసింది.
స్వలింగ సంపర్కుల వివాహాలపై తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో.. సీజేఐ డి.వై.చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాలను గుర్తించబోమనడం సరికాదు సీజేఐ తెలిపారు. స్వలింగ వివాహాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, హోమో సెక్సువాలిటీ కేవలం నగరాలు, ఉన్నతవర్గాలకు సంబంధించింది కాదన్నారు. ఆర్టికల్ 19 ప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేశారు. భిన్నలింగ జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులుగా ఉంటారనేందుకు ఆధారాలు లేవని చంద్రచూడ్ చెప్పారు.
స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ లోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్ధం అనవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలన్నారు. శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు.. స్వలింగ వివాహాలపై కేంద్రమే కమిటీ వేయాలని తెలిపింది. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేమని, వివాహ చట్టంలో మార్పులు చేయాలా? వద్దా? అనేది పార్లమెంట్ నిర్ణయించాలని తెలిపింది. సీజేఐ డీ.వై.చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలతో జస్టిస్ సంజయ్ కౌల్ ఏకీభవించారు.
మొత్తం 20 స్వలింగ జంటలు వేసిన పిటిషన్ ను విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. LGBTQIA (Gay, Lesbian, Bisexual, Transgender, Queer, Intersex, and Asexual people) వర్గాలకు చెందిన వారి పెళ్లిళ్లకు తాము చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.