Sabarimala : శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నిత్యం లక్ష మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. శబరిపీఠం వద్ధ స్వామి దర్శనం కోసం ఇరుముడి నెత్తిన పెట్టుకుని లైన్ లో నిల్చున్నారు. విపరీతమైన రద్దీ ఉండడంతో మరిన్ని ఏర్పాట్లు చేసేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
గత కొన్నిరోజులుగా శబరిమలకు అయ్యప్ప మాలధారులు పోటెత్తుతున్నారు. ఇటీవల నిత్యం లక్ష మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. దాంతో భక్తులను నియంత్రించడం సిబ్బందికి, అధికారులకు కష్టమవుతోంది. భక్తుల రద్దీ అధికమవుతున్న నేపథ్యంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజుకు 90 వేల మందికే దర్శనం కల్పించాలని తీర్మానించింది. భక్తుల తాకిడి పెరిగిపోతున్న నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్, ట్రావెన్ కూర్ దేవస్థానం బోర్డు వర్గాలు, ఉన్నతాధికారులతో సమావేశమై, పరిస్థితులను సమీక్షించారు.