RSS: ఉద్యోగాలు అడగొద్దు. ప్రభుత్వ జాబులు అస్సలే ఆశించొద్దు. ఏ పని దొరికితే అది చేయండి. అన్ని పనులను గౌరవించండి.. ఇదీ స్థూలంగా RSS చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు. ఈ మాటలే ఇప్పుడు దేశంలో కలకలం రేపుతున్నాయి. మరి, ప్రధాని మోదీ కల్పిస్తానన్న 2 కోట్ల ఉద్యోగాల సంగతి అంతేనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు, నిరుద్యోగులు. ఇంతకీ మోహన్ భాగవత్ ఏమన్నారంటే…
అన్ని రకాల వృత్తులను గౌరవించలేకపోవడమే నిరుద్యోగ సమస్యకు మూల కారణమని ఆరెస్సెస్ చీఫ్ అన్నారు. ఉద్యోగాల కోసం పరితపించొద్దంటూ యువతకు ఉచిత సలహా కూడా ఇచ్చారు.
”ఎలాంటి పని నైనా గౌరవించాలి. పనిని గౌరవించ లేకపోవడమే సమాజంలో నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణం. మేధస్సుతో చేసేదైనా, శారీరక శ్రమతో చేసే కష్టమైనా ముందు దాన్ని గౌరవించాలి. చాలా మంది ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు. ప్రభుత్వ రంగం కేవలం 10 శాతం మాత్రమే ఉద్యోగాలు కల్పించగలదు. ఇతర ఉద్యోగాలు మరో 20 శాతం ఉంటాయి. ప్రపంచంలో ఏ సమాజమూ 30 శాతానికి మించి ఉద్యోగాలను కల్పించలేదు” అని మోహన్ భాగవత్ అన్నారు.
అలాంటప్పుడు మీ డైరెక్షన్ లో పని చేసే బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎందుకు హామీ ఇచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల మాటేంటని ప్రశ్నించారు. ”ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరితపించొద్దని సూచించారు సరే.. మరి ప్రైవేటు ఉద్యోగాలైనా ఏవి భాగవత్ జీ” అంటూ విమర్శించారు.