శనివారం నాగ్పుర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బంగ్లాలో హిందువుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
హిందువులను శత్రువులుగా చిత్రీకరిస్తున్నారు…
భారత సంస్కృతి, సంప్రదాయాలపై అక్కడ విషం చిమ్ముతున్నారని, హిందువులను శత్రువులుగా చూపించేందుకు ఒడిగడుతున్నారన్నారు. భారత బలాన్ని తగ్గించేందుకు, అలాగే సంకల్పాన్ని బలహీనం చేసేందుకు కుతంత్రాలు చేస్తున్నారని భగవత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో నిరంకుశ మతవాదం హెచ్చుమీరుతోందన్నారు. మైనారిటీలతో పాటు ప్రత్యేకంగా అక్కడి హిందువుల తలలపై కత్తిని వేలాడదీస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది మన సమాజానికి సిగ్గుచేటు…
మరోవైపు మహిళలపై ఆగడాలు మితిమీరిపోతున్నాయని భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఉదంతం దేశాన్నే కుదిపేసిందన్నారు. ఇది మన సమాజానికి సిగ్గుచేటన్నారు. స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పుకొచ్చారు. నేరం జరిగి నెలలు గడుస్తున్నా, బాధితురాలికి మాత్రం న్యాయం జరగకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
అవే నాశనం చేస్తున్నాయి…
ఇలాంటి పరిస్థితులు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, ఫలితంగా నిరుత్సాహం తాండవిస్తుందన్నారు. ఈ కేసులో నేరస్థులను రక్షించాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. నేరాలు, దుష్ట రాజకీయాలు, విష సంస్కృతి మన సమాజాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ఎస్ శతమానం భవతి…
మహారాష్ట్రలోని నాగ్ పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ ఏర్పాటై 100 ఏళ్లు అవుతోంది. ఈ ఏడాదితో వందో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భగవత్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ వేడుకల్లో స్పెషల్ గెస్టులుగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహా ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఇస్రో మాజీ ఛైర్మన్లు రాధాకృష్ణన్, శివన్ లు పాల్గొన్నారు. దేశంలో సామరస్యం వెల్లివిరియాలంటే కుల, మతాలకు అతీతంగా స్నేహం కొనసాగాలని సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి భగవత్ ఉత్తేజపరిచారు.
ఐక్యంగా ఉండాల్సిందే…
బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా జరిగిన భయానకమైన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రాంతంతో భేదం లేకుండా మనమంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే ఎటువంటి ఘర్షణలకు అవకాశముండదని హితవు పలికారు. ఇక ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనా ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : అందుకే భార్య మాట వినాలి.. ఒక్కరోజులో రూ.25 కోట్లు.. ఈ భర్త భలే లక్కీ