RJD : నూతన పార్లమెంట్ భవనం కేంద్రంగా మరో వివాదం రాజుకుంది. రాష్ట్రీయ జనతా దళ్ ఈ భవనంపై వివాదాస్పద ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన కాసేపటికే ఈ ట్వీట్ చేసింది. శవపేటిక, పార్లమెంట్ నూతన భవనం ఫోటోలను పక్కపక్కన పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీని అర్థం ఏంటి అంటూ క్యాప్షన్ను జోడించింది.
RJD తీరును బీజేపీతోపాటు పలు విపక్ష పార్టీలు కూడా ఖండించాయి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తాము కూడా బహిష్కరించామని MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అయితే RJD ట్వీట్పై కూడా ఆయన స్పందించారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఈ కోణంలో చూడాల్సింది కాదన్నారు.
ఇక RJD ట్వీట్పై కమలనాథులు తీవ్రంగా మండిపడుతున్నారు. చారిత్రాత్మకమైన రోజు కూడా రాజకీయం చేయాలనుకోవడం సరికాదన్నారు. RJD నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని.. అందుకే ఆ అర్థం వచ్చేలా ట్వీట్ చేసినట్టు RJD నేతలు తెలిపారు.
పార్లమెంట్ కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చడంపై బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యానికి చిహ్నంగా అత్యాధునిక హంగులతో నిర్మించిన సరికొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, దేశం అంటే గౌరవం లేనివారే ఇలా ప్రవర్తిస్తారని మండిపడ్డారు.