Republic Day: దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలతో పాటు ఈజిప్టు ప్రధాని అబ్దెల్ ఫట్టా ఎల్ సిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్తవ్యపథ్ మైదానంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పారా మిలటరీ దళాలు చేసిన కవాతు ఆకట్టుకుంది. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొదటిసారి చోటుచేసుకున్న కొన్ని విశేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సెంట్రల్ విస్టా పునర్నిర్మాణంలో భాగంగా పరేడ్ నిర్వహించే మార్గానికి కొన్ని మార్పులు చేశారు. దీంతో ఆ మార్గం పేరును రాజ్పథ్ నుంచి కర్తవ్య్ పథ్గా మార్చారు. మొట్టమొదటి సారి సైన్యంలో చేరిన అగ్నివీరులు పరేడ్లో పాల్గొన్నారు. మొదటి సారి గణతంత్ర దినోత్స వేడుకలకు ఈజిఫ్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్ సిసి హాజరయ్యారు. అంతేకాకుండా ఈసారి 120 మంది ఈజిఫ్టు సైనికుల బృందం కూడా కవాతులో పాల్గొంది.
ఈసారి గౌరవవందనంలో దేశీయంగా రూపొందించిన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్ను ఉపయోగించారు. అలాగే అర్జున్ యుద్ధ ట్యాంకర్లు, ఆకాశ్ క్షిపణి వ్యవస్థను ప్రదర్శనకు ఉంచారు. దీంతో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ ట్యాంకర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన మహిళా టీమ్ ఈసారి ఉత్సవాల్లో పాల్గొంది. మొట్టమొదటిసారి నార్కోటిక్స్ బ్యూరో శకటాన్ని ప్రదర్శించింది.