President Draupadi Murmu Rejected Mercy Petition of Pakistan Terrorist: దాదాపు 24 ఏళ్ల నాటి ఎర్రకోట దాడి కేసులో దోషిగా తేలిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు బుధవారం (జూన్ 12) ఒక ఉన్నతాధికారి తెలిపారు. జూలై 25, 2022న పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి తిరస్కరించిన రెండవ క్షమాభిక్ష పిటిషన్ ఇది.
నవంబర్ 3, 2022న, సుప్రీంకోర్టు ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో అతనికి విధించిన మరణశిక్షను సమర్థించింది. అయితే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుదీర్ఘ జాప్యం కారణంగా మరణశిక్ష విధించిన దోషి తన శిక్షను మార్చాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానం తలుపులు తట్టవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.
రాష్ట్రపతి ముర్ము మే 15న పాక్ టెర్రరిస్ట్ ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్ను స్వీకరించారు. ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్ను మే 27న రాష్ట్రపతి తిరస్కరించినట్లు.. సెక్రటేరియట్ ఆర్డర్ను ఉటంకిస్తూ అధికారులు మే 29న తెలిపారు.
Also Read: భారత్లోని పేదలు, వయనాడ్ ప్రజలు.. వీరే నా దేవుళ్లు: రాహుల్ గాంధీ
అయితే ఉరిశిక్షను సమర్థిస్తూ సుప్రీంకోర్టు, ఆరిఫ్కు అనుకూలంగా ఎటువంటి ఉపశమన పరిస్థితులు లేవని పేర్కొంది. ఎర్రకోటపై దాడి దేశ ఐక్యత, సమగ్రత సార్వభౌమాధికారానికి ప్రత్యక్ష ముప్పుగా ఉందని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది.
డిసెంబరు 22, 2000న జరిగిన ఈ దాడిలో ఎర్రకోట ప్రాంగణంలో ఉన్న 7 రాజ్పుతానా రైఫిల్స్ యూనిట్పై చొరబాటుదారులు కాల్పులు జరిపారు. ఫలితంగా ముగ్గురు ఆర్మీ సిబ్బంది మరణించారు. పాకిస్తాన్ జాతీయుడు, నిషేధిత లష్కరే తోయిబా సభ్యుడు ఆరిఫ్ను దాడి జరిగిన నాలుగు రోజుల తరువాత ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.