Delhi Air Pollution : అక్కడి గాలి గరళంతో సమానం.. గాలి పిలిస్తే రోగాల రాక తప్పదు.. పిల్లలు, పెద్దలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయపడేలా ఉంది పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు దేశ రాజధాని ఓ గ్యాస్ చాంబర్. అత్యున్నత స్థాయి మీటింగ్లు, సరి, బేసి విధానాలు, పొరుగు రాష్ట్రాల్లో పంట తగలబెట్టడంపై ఆంక్షలు.. ఇవేవీ కూడా ఢిల్లీ మళ్లీ కాలుష్య కోరల్లో చిక్కకుండా కాపాడలేకపోయాయి. వరసగా నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర నంబర్లను చూపిస్తోంది. సాధారణంగా ఉండాల్సిన గాలి నాణ్యతకు ఏకంగా వంద రేట్లు ఎక్కువ ప్రమాదకర స్థాయిలో ఉంది ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్.
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఆప్ సర్కార్ ఎన్నో ఏళ్లుగా చాలా విధానాలను అవలంభిస్తోంది. డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ AMVలు రోడ్లపైకి వస్తే మోటార్ వాహనాల చట్టం-1988 సెక్షన్ 194 కింద ప్రాసిక్యూట్ చేస్తామని, 20 వేల జరిమానా విధిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా పొగభూతం మాత్రం ఆగడం లేదు.
ఈ ఏడాది ఈస్థాయిలో కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం పంజాబ్, హర్యాణా రాష్ట్రాలని తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం పంటలను తగులబెడుతుండటంతో ఒక్కసారిగా కాలుష్యం కాటు వేసింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 200 పాయింట్లు పెరిగింది.
గత ఏడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను కాల్చడం, దీపావళి సమయంలో బాణాసంచా పేలుళ్లు, పరిశ్రమలు, వాహన కాలుష్యాలతో రాజధాని ఒక గ్యాస్ చాంబర్లా మారిపోయింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు చర్యలు ప్రకటించారు. పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల్ని ఇష్టారాజ్యంగా కాల్చడం వల్లే ఢిల్లీ గ్యాస్ చాంబర్లా మారిపోయిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. కాలుష్యం పెరగడంతో స్కూల్ పిల్లలకు మాస్క్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీ ప్రభుత్వం మొత్తంగా 50 లక్షల మాస్క్లను పంపిణీ చేస్తోంది. మాస్క్ లేకుండా బయటకు రావద్దని రాజధాని వాసులను సీఎం అరవింద్ కోరారు.
అంతేకాదు రాజధాని ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై నిషేధం విధించింది ఢిల్లీ సర్కార్. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ ప్యానెల్ నిషేధించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.