RBI: మన దేశంలోని బ్యాంకుల్లో 2023 ఫిబ్రవరి నాటికి ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. బ్యాంకుల వారీగా ఉన్న ఈ మొత్తాల వివరాలను పొందుపరుస్తూ.. ఓ వెబ్సైట్ను రూపొందించింది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. పదేళ్ల కంటే ఎక్కువ కాలం బ్యాంకు అకౌంట్ ద్వారా ఏ లావాదేవీలు జరగకపోతే.. ఆ అకౌంట్లో అప్పటివరకు ఉన్న డిపాజిట్ మొత్తాన్ని అన్క్లెయిమ్డ్డిపాజిట్గా పరిగణిస్తారు. వీటినే ఆయా బ్యాంకులు రిజర్వు బ్యాంకుకు బదిలీ చేస్తుంటాయి.
గతంలో బ్యాంకు అకౌంట్ తెరిచి, కొన్నాళ్లు వాడి, అందులో ఎంతో కొంత డబ్బు ఉన్నా.. పట్టించుకోకుండా వదిలేసిన డిపాజిటర్లు, ఒకవేళ డిపాజిటర్లు చనిపోతే వారి నామినీల వివరాలను ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఆర్బీఐ నమోదుచేయనుంది.
ఈ సైట్లో తమ వివరాలున్న వ్యక్తులు తగిన గుర్తింపు పత్రాలతో తమను సంప్రదిస్తే.. ఆ మొత్తాన్ని తిరిగిస్తామని ఆర్బీఐ ప్రకటించింది.
దేశంలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిటర్లు జమ చేసి, ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలేసిన సొమ్ము ఏకంగా రూ. 35,000 వేల కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
తమ వద్ద ఉన్న అన్క్లెయిమ్డ్ మొత్తాలను ఆయా బ్యాంకులు.. రిజర్వ్ బ్యాంకు నిర్వహించే ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ)ఫండ్’కు బదిలీ చేశాయి.
ఆర్బీఐ లెక్కల ప్రకారం.. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.8,086 కోట్లతో తొలిస్థానంలో ఉండగా, రూ.5,340 కోట్లతో , పంజాబ్నేషనల్ బ్యాంక్ రెండవస్థానంలో, రూ.4,558 కోట్లతో కెనరా బ్యాంకు మూడవస్థానంలో, రూ.3,904 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నాల్గవ స్థానంలో ఉంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా.. మీపేరు ఆర్బీఐ వారి udgam.rbi.org.in వెబ్సైట్లో ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.