RBI: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 వేల 760 కోట్లు మిస్సయ్యాయి.. అస్సలు ఆచూకీ దొరకడం లేదు.. ఎక్కడికి వెళ్లాయో తెలియడం లేదు.. ఎవరి దాచేశారో అర్థం కావడం లేదు. ఇంతకీ ఏంటీ 9 వేల 760 కోట్ల పంచాయితీ అనుకుంటున్నారా? భారతీయ రిజర్వ్బ్యాంక్ 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఓసారి డేట్ను కూడా ఎక్స్టెండ్ చేసింది. అయితే చలామణీలో ఉన్న 97.26 శాతం 2 వేల నోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చేశాయని RBI తెలిపింది.
రూ.2 వేల నోటును ఉపసంహరించుకుని ఆరు నెలలు దాటినప్పటికీ.. ఇంకా 9 వేల 760 కోట్లు విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది RBI. 2 వేల నోటు ఇప్పటికీ లీగల్ టెండర్గా కొనసాగుతుందని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది.
రూ.2 వేల విలువైన నోటును ఆర్బీఐ ఈ ఏడాది మే 19న ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం తీసుకునే నాటికి 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి లేదా డిపాజిట్కు ప్రజలకు మొదట సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత అక్టోబర్ 7 వరకు ఆ గడువును పొడిగించారు. ప్రస్తుతం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే నోట్లను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 30 నాటికి 97.26 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.
అయితే ప్రజలు ఇప్పటికీ తమ వద్ద ఉన్న 2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాల్లో వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదా తమ దగ్గరలో ఉన్న ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించి, తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయమని కోరే అవకాశాన్ని కూడా RBI ప్రజలకు ఇచ్చింది.
ఇన్నీ అవకాశాలు ఇచ్చినా.. సమయం పొడిగించినా 2 వేల నోట్లు మాత్రం పూర్తిగా వెనక్కి రావడం లేదు. మరి 9 వేల 760 కోట్లు ప్రజల వద్దే ఉన్నాయా? లేదా ? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.