RBI new guidelines(Telugu breaking news today): బ్యాన్ అయిన వెయ్యి రూపాయల నోటు మళ్లీ రానుందా? 2వేల నోటును ఇటీవల ఉపసంహరించుకున్న ఆర్బీఐ దానికి ప్రత్యామ్నాయంగా 1000 నోటును మళ్లీ ప్రవేశపెట్టనుందా? నగదు చలామణీలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వెయ్యి నోటును మళ్లీ తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కసరత్తు చేస్తుందా? గతకొన్ని రోజులుగా జనబాహుళ్యంలో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఐతే ఈ వార్తలన్నింటికీ ఆర్బీఐ గవర్నర్ చెక్ పెట్టారు.
వెయ్యి రూపాయల నోటును మళ్లీ ప్రవేశ పెట్టే ఆలోచన లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్. ప్రస్తుతం చెలామణీ అవుతున్న 500 కరెన్సీని బ్యాన్ చేయబోమని చెప్పారు. సామాన్య ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వడ్డీ రేట్ల ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
ఇక, 2వేల నోటును ఆర్బీఐ ఉపసంహరించాక ఇప్పటి వరకు 50శాతం నోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. అంటే ఇంకా సగం నోట్లు జనం దగ్గరే ఉన్నాయి. ఐతే 2వేల నోటు ఉపసంహరణ గడువును ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు ఇచ్చింది. అప్పటి వరకు 2వేల నోటును మార్చుకోవచ్చు. మొత్తం 2వేల నోట్ల విలువ 3లక్షల 62వేల కోట్లు అయితే.. ఇప్పటి వరకు లక్షా 82వేల కోట్ల నోట్లు మాత్రమే రిటర్న్ వచ్చాయి.
మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను వెల్లడించిన ఆయన.. రెపోరేటు 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇక బ్యాంక్ రేట్ ను కూడా 6.75 శాతానికే పరిమితం చేశామన్నారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వడంలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది మే నుంచి రెపో రేటు ను 250 బేసిస్ పాయింట్ల మేరా పెంచినప్పటికీ ఈ సారి మాత్రం ఎలాంటి పెంపులేని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.