Ranjith Sreenivasan Murder Case : 2021 డిసెంబర్ 19న కేరళలోని అలప్పుళ ప్రాంతంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అలప్పుళ కోర్టు మంగళవారం తుదితీర్పు వెలువరించింది. రంజిత్ శ్రీనివాసన్ హత్యకేసులో నిందితులుగా నిర్థారించబడిన 15 మందికి మరణ శిక్ష విధించింది. నిందితులంతా నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన వ్యక్తులు కావడం గమనార్హం. అలాగే ఒక హత్యకేసులో ఇంత ఎక్కువమందికి మరణశిక్ష విధించడం కేరళ చరిత్రలోనే తొలిసారి.
రంజిత్ శ్రీనివాసన్ హత్యకేసులో నిందితులుగా ఉన్నవారిలో 8 మందిపై హత్య అభియోగాలు, మిగతా వారిపై కుట్ర ఆరోపణలు రుజువైనట్లు కోర్టు వెల్లడించింది. వీరంతా శిక్ష పొందిన కిల్లర్ స్క్వాడ్ అని, బీజేపీ నేతను ఆయన కుటుంబ సభ్యుల కళ్లెదుటే అతి దారుణంగా హతమార్చారని ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది. ఈ హత్యను అత్యంత క్రూరమైన నేరంగా పరిగణించి దోషులకు గరిష్ఠ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఈ హత్య అత్యంత అరుదైన కేసు కిందకు వస్తుందన్న న్యాయమూర్తి శ్రీదేవి వీజీ.. నైసామ్, అజ్మల్, అనూప్, మహమ్మద్ అస్లాం, అబ్దుల్ కలాం అలియాస్ సలాం, అబ్దుల్ కలాం, సఫారుద్దీన్, మన్షాద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, లకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. నజీర్, జాకీర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్, షెర్నాస్ అష్రఫ్ లకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసును అలప్పుజ డివై నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేసింది. ఎస్పీ ఎన్ ఆర్ జయరాజ్ ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్ జి. పడిక్కల్, న్యాయవాదులు శ్రీదేవి ప్రతాప్, శిల్పా శివన్, హరీష్ కట్టూర్ వాదనలు వినిపించారు.
రంజిత్ హత్యకేసును ఇన్వెస్టిగేట్ చేసిన అధికారుల అభిప్రాయం ప్రకారం.. రంజిత్ను చంపడం.. అలప్పుజాలోని మన్నన్చేరి వద్ద కుప్పెజామ్ జంక్షన్లో SDPI రాష్ట్ర కార్యదర్శి K. S. షాన్ హత్యకు ప్రతీకారంగా జరిగిన చర్య అని తెలుస్తోంది. 2021 డిసెంబర్ 18వ తేదీ రాత్రి షాన్ హత్యకు గురయ్యారు. ఫిబ్రవరి 24, 2021న అలప్పుజాలోని వాయలార్లో SDPI వ్యక్తులు RSS కార్యకర్త నందుకృష్ణను హత్య చేయడమే షాన్ హత్యకు ట్రిగ్గర్ అయినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. హై-ప్రొఫైల్ ‘మత సమ్మేళనంతో కూడిన రాజకీయ హత్యలు’ కేరళలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే భయాలకు దారితీశాయి.
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయిన రంజిత్ శ్రీనివాసన్ ను.. పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ కార్యకర్తలు అతడి ఇంటిలోకి చొరబడి చంపేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. ఆపై విచారణ చేసిన అదనపు సెషన్స్ కోర్టు.. 15 మందిని దోషులుగా నిర్థారించింది. రంజిత్ శ్రీనివాసన్ హత్యకు ఒకరోజు ముందు.. అంటే 2021 డిసెంబర్ 18న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) నాయకుడు కేఎస్ షాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముఠా హతమార్చింది. కొద్దిగంటలకే రంజిత్ శ్రీనివాసన్ కూడా హత్యకు గురి కావడం అప్పట్లో తీవ్ర సంచలనానికి దారితీసింది.
.
.