అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ముహూర్తంపై పలు పీఠాధిపతులు చేసిన వ్యాఖ్యలపై యోగా గరువు బాబా రాందేవ్ స్పందించారు. ముహూర్తం పవిత్రం కాదని చెప్పడం సరికాదన్నారు. రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దని వారు కోరారు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ పవిత్రత ఉంటుందని తెలిపారు.
విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో బాబా రాందేవ్ మీడియాతో మాట్లాతూ.. ‘ఇది కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదు. రామరాజ్యం దిశగా దేశం యొక్క పురోగతి. శ్రీరాముడు గుడారం నుండి ఆలయానికి వస్తున్నాడు. ‘గర్భగృహ’ నిర్మాణం పూర్తయింది. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాత్రంత్రం వచ్చింది. అయితే.. ఇప్పటి నుంచి దేశంలో సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక స్వాతంత్రం కూడా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
రామ్ లల్లా ప్రాణప్రతిష్ట శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతుందని తెలిపారు. దేశాన్ని ఆర్థిక, విద్యా బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు ప్రాణ ప్రతిష్ట రోజున దేశ ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని రాందేవ్ సూచించారు.