Rajnath Singh : దేశ సరిహద్దులో చైనా దుశ్చర్యపై లోక్సభలో రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చైనా ఆర్మీ భారత భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిందని లోక్ సభలో తెలిపారు. చైనా సైనికుల కుత్రంతాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని స్పష్టం చేశారు. భారత పోస్టును ఆక్రమించేందుకు చైనా సైన్యం యత్నించిందని వెల్లడించారు. సరైన సమయంలో భారత బలగాలు స్పందించాయని వివరించారు. దీంతో చైనా సైన్యం తోకముడుచుకుని తిరిగి వారి పోస్టులోకి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.
ఇరుదేశాల సైనికుల మధ్య ఈ నెల 9న తవాంగ్ సెక్టార్ లో ఘర్షణ జరిగిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. చైనా పీఎల్ఏ సైనికులు భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించారని అయితే భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందన్నారు. భారత్ భూభాగంలోకి చైనా బలగాల చొరబాటును మన సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారన్నారు. చైనా సైనికులను తిరిగి తమ పోస్ట్వైపు వెళ్లిపోయేలా చేశారని రాజ్నాథ్ ప్రకటించారు.
ఘర్షణల్లో ఇరుదేశాల సైనికులకూ గాయాలయ్యాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అయితే భారత సైన్యంలో ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని వివరించారు. సరైన సమయంలో కమాండర్ల జోక్యంతో పీఎల్ఏ సైన్యం వెనక్కి వెళ్లిపోయిందన్నారు. స్థానిక భారత కమాండర్ చైనా రక్షణశాఖ అధికారులతో డిసెంబర్ 11న తవాంగ్ ఘటనపై చర్చించారని రాజ్ నాథ్ తెలిపారు.
విపక్షాల ఆందోళన..
అంతకుముందు తవాంగ్ ఘటనపై విపక్షాల ఆందోళనతో కాసేపు పార్లమెంట్ ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. తవాంగ్ ఘటనపై చర్చ జరపాలని లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌధరి, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేస్తారని తెలిపారు. అయితే చర్చ జరగాలంటూ విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగడంతో స్పీకర్ ఓంబిర్లా సభను కాసేపు వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు. తక్షణమే సరిహద్దు అంశంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభను కాసేపు వాయిదా వేశారు.