Rajiv Gandhi : భారత్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతిని దేశ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని వీర్ భూమి వద్ద సోనియా గాంధీ నివాళులు అర్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. రాజీవ్ కు పుష్పాంజలి ఘటించారు.
తండ్రి జ్ఞాపకాలను రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్లోని లేహ్లో ఆయన పర్యటిస్తున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుకు శనివారం బైక్ యాత్ర చేపట్టారు. రాత్రి పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉన్న టూరిస్ట్ క్యాంప్లో బస చేశారు. రాజీవ్ గాంధీ జయంతిని రాహుల్ ఇక్కడే నిర్వహించారు.
గతంలో తన తండ్రి భారత్లోని వివిధ ప్రాంతాల్లో తీసిన ఫోటోలను రాహుల్ ట్విటర్లో షేర్ చేశారు. నాన్న.. భారత్ కోసం మీరు కన్న కలలను, వెలకట్టలేని ఈ జ్ఞాపకాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. మీరు చూపిన మార్గంలోనే నడుస్తున్నామని తెలిపారు. ప్రతి భారతీయుడి కష్టాలను అర్థం చేసుకుంటానని, భరతమాత గొంతును వింటున్నానని పేర్కొంటూ రాజీవ్ తీసిన ఫొటోలకు సంబంధించిన వీడియోను రాహుల్ షేర్ చేశారు.
ఆగస్టు 25 వరకు రాహుల్ గాంధీ లేహ్ పర్యటన కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో నిర్వహించే ఓ ఫుట్బాల్ మ్యాచ్ను రాహుల్ వీక్షిస్తారు. లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ – కార్గిల్ ప్రాంతంలో కౌన్సిల్ ఎన్నికలు సెప్టెంబర్ 10న జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాహుల్తో పలువురు నేతలు సమావేశం కానున్నారు.