Vande Bharat Express: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్ప్రెస్కు సంబంధించి ఇటీవల ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. రైల్లో ప్రయాణికులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, ఫుడ్ వేస్టేజ్ను ఇష్టం వచ్చినట్లుగా పడేశారు. వాటిని సిబ్బంది ఊడ్చగా.. కుప్పగా పోగుపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు.. వందే భారత్ రైలును చెత్తగా మార్చేస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో క్లీనింగ్ పద్ధతిని మార్చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. విమానాల్లో లాగానే మెయింటనెన్స్ సిబ్బంది ఒకరు చెత్త బుట్టతో ప్రయాణికుల వద్దకే వచ్చి టీ కప్పులు, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లను తీసుకెళ్తారని చెప్పారు.
ఈ కొత్త పద్ధతికి సంబంధించి ఓ వీడియోను షేర్ చేస్తూ ప్రజలందరూ సహకరించాలని అశ్విని వైష్ణవ్ కోరారు. ఆహార పదార్థాలు తినేశాక మిగిలిన వాటిని బోగీలోనే పడేయకుండా పక్కన పెట్టి, మెయింటనెన్స్ సిబ్బంది వచ్చాక ఆ చెత్త బుట్టలో పడేయాలని ప్రయాణికులను విజ్ఞప్తి చేశారు.